23 మందిని కొన్నావు.. 23 మందే మిగిలారు..!

24 May, 2019 11:50 IST|Sakshi

చంద్రబాబుపై సోషల్‌ మీడియాలో సెటైర్లు

సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దెబ్బకు టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ చూడనంతటి భారీ వైఫల్యాన్ని తెలుగుదేశం మూటగట్టుకుంది. గురువారం (మే 23) వెల్లడైన ఫలితాల్లో ఏపీ ప్రజలు జననేత జగన్‌కు జైకొట్టారు. ఆయన ఆద్వర్యంలోని వైఎస్సార్‌సీపీకి 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ సీట్లతో అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ఇక నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకు తిరిగిన చంద్రబాబు పాచికలు ఈ ఎన్నికల్లో పారలేదు. ఆయన మేనేజింగ్‌ స్కిల్స్‌ ఫ్యాన్‌ గాలి హోరులో సై‘కిల్‌’ కాకుండా కాపాడలేకపోయాయి. ఇక సామాజక మాధ్యమాల్లో టీడీపీ ఘోర ఓటమిపై మీమ్స్‌, సెటైర్స్‌ పేలుతున్నాయి. అధికార దాహంతో చంద్రబాబు సాగించిన ఎమ్మెల్యేల అనైతిక కొనుగోళ్లను ఎత్తిచూపుతూ..

‘'23' చరిత్రలో నిలిచిపోయే సంఖ్య..! 23 మందిని కొన్నావు. ఈ ఎన్నికల్లో 23 మందే గెలిచారు. కౌటింగ్‌ 23నే అయింది’ అంటూ వేదాంత ధోరణిలో చంద్రబాబుకు చురలంటిస్తున్నారు. ఫలితాల వెల్లడి మే23న కాకుండా ఈ నెల 31 జరిగితే బాగుండునని మరికొందరు అంటున్నారు. కనీసం అప్పుడైనా చంద్రబాబుకు 31 సీట్లు దక్కేవని జాలి చూపిస్తున్నారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని కోడికత్తి అని ఎద్దేవా చేసిన చంద్రబాబును.. ప్రజలు కోడికత్తితో కసితీరా పొడిచారని మరొకరు పేర్కొన్నారు. ఇక ఎన్నికల్లో తమ అధినేత అనుసరించిన వ్యూహాలన్నీ తల్లకిందులయ్యాయనే అభిప్రాయాన్ని టీడీపీ సీనియర్‌ నేతలు వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు