ఈఎస్‌ఐ స్కామ్‌: ‘అచ్చెన్నాయుడు తప్పు ఒప్పుకున్నట్టే కదా!

21 Feb, 2020 14:22 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : కార్మికుల పొట్ట కొట్టిన అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌ రెడ్డి అన్నారు. ఈఎస్‌ఐ కుంభకోణానికి మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఈఎస్ఐలో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీకి గురైన సొమ్మునంతా అవినీతి పరుల నుంచి  రప్పించాలని పేర్కొన్నారు. 
(చదవండి : ఏపీ ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం)

‘మేము గతంలోనే చెప్పాం ఈఎస్ఐ హాస్పిటల్స్‌లో అవినీతి జరుగుతోందని, ఇప్పుడు విజిలెన్స్ నివేదిక ద్వారా అదే నిజమైంది. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా టీడీపీ మారింది. మంత్రిగా అచ్చెన్నాయుడు  ఒత్తిడి మేరకే మూడు కంపెనీలకు నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టు ఇచ్చారు. తెలంగాణలో ఎలా కాంట్రాక్టు ఇచ్చారో ఇక్కడ కూడా ఏపీలో కూడా అలానే ఇచ్చామని  అచ్చెన్నాయుడు అంటున్నారు. తెలంగాణలో తప్పు జరిగింది కాబట్టి ఇక్కడ కూడా తప్పు జరిగినట్లు ఒప్పుకున్నట్టే కదా’అని మంత్రి గౌతమ్‌రెడ్డి అన్నారు.

బండారం బయటపడింది..
సాక్షి, శ్రీకాకుళం: ఈఎస్‌ఐలో కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పై కేసునమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇష్టానుసారం అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ‘టెండర్ ప్రక్రియ లేకుండా టెలీహెల్త్ సర్వీసెస్‌కు కాంట్రాక్టులు కట్టబెట్టారంటే ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారో అర్థమవుతుంది. అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకొని మోసానికి పాల్పడ్డ సొమ్ము రికవరీ చేయాలి. ఎటువంటి నియమాలు పాటించకుండా రెండు వందలు విలువచేసే ఈసీజీ కి రూ.480 చెల్లించారంటేనే అచ్చెన్నాయుడు అవినీతి బండారం బయటపడింది’అని కృపారాణి అన్నారు.

>
మరిన్ని వార్తలు