‘స్పీకర్‌ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు’

15 Dec, 2018 13:11 IST|Sakshi
ఆదిమూలపు సురేష్‌

కోడెల శివప్రసాద్‌పై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం

సాక్షి, అమరావతి : అధికార పార్టీ ఎమ్మెల్యే ఈరన్న విషయంలో సుప్రీంకోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టు లాంటిదని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేర చరితుడైన నేతను టీడీపీ ఇన్నాళ్లు కాపాడిందనీ, అలాంటి వారిని ఎమ్మెల్యేగా తెచ్చి అసెంబ్లీని మలినం చేసిందని మండిపడ్డారు. కోర్టు తీర్పు ప్రతిని అసెంబ్లీ కార్యదర్శికి అందించామని తెలిపారు. తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించాలని స్పీకర్‌కి కోర్టు స్పష్టంగా చెప్పినా.. సన్నాయి నొక్కులు నొక్కుతూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కోర్టు తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత స్పీకర్‌కి, ముఖ‍్యమంత్రి చంద్రబాబునాయుడికి లేదా అని ప్రశ్నించారు. 24 గంటల్లోగా కోర్టు తీర్పుని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నేర చరిత్ర కలిగిన ఈరన్నను కాపాడాలనుకుంటున్నారంటూ మండిపడ్డారు. కోర్టు 27వ తేదీన ఈరన్న ఎమ్మెల్యే కాదని తీర్పు ఇస్తే.. ఆయన నిన్న (శుక్రవారం) రాజీనామా చేయటం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యటంగా సురేష్‌ అభివర్ణించారు. (ఎమ్మెల్యే ఈరన్న పిటీషన్‌ కొట్టివేత)

తీర్పుని గౌరవించండి..
ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ.. 23 మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టు కొన్నారని టీడీపీపై నిప్పులు చెరిగారు. స్పీకర్‌ని కలిసి కోర్టు తీర్పును గౌరవించాలని కోరినట్టు తెలిపారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రాజ్యాంగాన్ని అపహస్యం చేసేలా వ్యవహరించారని మండిపడ్డారు. ఇప్పుడైనా న్యాయస్థానం తీర్పును గౌరవించి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించాలని డిమాండ్‌ చేశారు. (ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించండి)

ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించండి..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత తిప్పేస్వామి మాట్లాడుతూ..  ‘ఎమ్మెల్యేగా పరిగణించాలని కోర్టు వెల్లడించింది. ఈరన్నపై ఏపీ, కర్ణాటకల్లో క్రిమినల్‌ కేసులున్నాయి. ఆయన భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. ఆ విషయాలేవీ ఈరన్న ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనలేదు. దీనిపై నాలుగేళ్లుగా పోరాడాను. కోర్టు తీర్పు నాకు అనుకూలంగా రావడం ఆనందంగా ఉంది’అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించమని స్పీకర్‌ను కోరినట్టు వెల్లడించారు. కోర్టు తీర్పును అసెంబ్లీ కార్యదర్శికి అందించామని చెప్పారు.

మరిన్ని వార్తలు