వైఎస్‌ జగన్‌ ఇంటి ముందు ఏపీ ఇంటెలిజెన్స్‌ హడావుడి

16 Jan, 2019 12:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి ముందు ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులు హడావుడి చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ నివాసానికి వచ్చేవారి వివరాలను సేకరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బృందం బుధవారం వైఎస్‌ జగన్‌తో సమావేశం కానున్న నేపథ్యంలోనే ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇక్కడ మోహరించినట్టుగా తెలుస్తోంది. ఈ వివరాలను వారు ఎప్పటికప్పుడూ విజయవాడకు చేరవేస్తున్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్‌ అధికారులు ఏపీ సీఎం చంద్రబాబు కోసం పనిచేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా, ప్రతిపక్ష నేత ఇంటి వద్ద ఇంటెలిజెన్స్‌ అధికారులు సమాచార సేకరణ కోసం ఇలా హడావుడి చేయడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. 
 

మరిన్ని వార్తలు