హైదరాబాద్‌ తానే కట్టానని సిగ్గులేకుండా.. 

13 Jan, 2020 19:27 IST|Sakshi

సాక్షి, క్రిష్ణా : ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ తానే కట్టానని సిగ్గులేకుండా చెబుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. సంక్రాంతి పండుగకు వచ్చిన కొత్త హరిదాసు చంద్రబాబంటూ ఎద్దేవా చేశారు. సోమవారం మూడు రాజధానులకు మద్దతుగా రవాణా శాఖ మంత్రి పేర్నినాని ఆధ్వర్యంలో మచిలీపట్నంలో భారీ  ర్యాలీ నిర్వహించారు. మంత్రి కొడాలి నానితో పాటు ఎమ్మెల్యేలు కైలే అనిల్‌ కుమార్‌, సింహాద్రి రమేష్‌ బాబులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా కోర్టు సెంటర్ వద్ద నుండి కోనేరు సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘ లక్షల కోట్లు ఖర్చు పెడితే ఒక్క ప్రాంతమే అభివృద్ధి చెందుతుంది. అదే డబ్బుతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయోచ్చు. అన్ని ప్రాంతాల అభివృద్ధి అవసరం లేదని బాబు అంటున్నారు. చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మొద్దు. రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్న దుర్మార్గుడు చంద్రబాబునాయుడు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణమాన్ని మనం సమర్ధిద్దాం. సీఎం జగన్‌ నిర్ణయానికి ప్రజలు సహకరించాల’’ని కోరారు. 

అంతకు ముందు రవాణా శాఖ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. అధికార, పరిపాలన వికేంద్రీకరణ జరగాలన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలన్నదే సీఎం జగన్‌ ఆలోచనగా పేర్కొన్నారు. గత ఐదేళ్ల బాబు పాలనలో రాష్ట్రం అప్పుల్లోకి వెళ్లిపోయిందన్నారు. రాజధానిపై ఎల్లో మీడియా దుష్ర్పచారం చేస్తోందన్నారు. ఎల్లోమీడియా దిగజారి వార్తలు రాస్తోందని మండిపడ్డారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను చంద్రబాబు పెడచెవిన పెట్టారన్నారు. బాబు తన పాలనలో కేవలం రూ. 5వేల కోట్లే ఖర్చు పెట్టారని తెలిపారు.

మరిన్ని వార్తలు