సాక్షి, అమరావతి: గత చంద్రబాబునాయుడు సర్కారు నిర్వాకం.. రైతులను నిండా ముంచేసింది. చంద్రబాబు ప్రభుత్వం.. ఏపీ సీడ్స్ సంస్థకు రూ. 380 కోట్లు ఎగనామం పెట్టింది. నిధులు ఇవ్వకపోవడంతో ఏపీ సీడ్స్ సంస్థ రాష్ట్రంలో రైతులకు కావాల్సిన విత్తనాలు సేకరించలేకపోయింది. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు లేకుండాపోయాయి. రైతులకు విత్తనాలు అందించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన చంద్రబాబు సర్కారు తీరుపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా మండిపడ్డారు.
చంద్రబాబు వల్లే రైతులకు ప్రస్తు దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాల సేకరణ కోసం గత జనవరి నుంచి వ్యవసాయశాఖ అధికారులు నిధులు మంజూరు చేయాలని కోరినా.. ఈ విషయమై 28 సార్లు అధికారులు చంద్రబాబుకు లేఖలు రాసినా... ఆయన పట్టించుకోలేదని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్లకు ధైర్యముంటే ఈ విషయంలో సమాధానం చెప్పాలని నిలదీశారు. గతంలో నిధుల కోసం వ్యవసాయ శాఖ అధికారులు రాసిన లేఖలను టీడీపీ ఆఫీస్కి పంపిస్తామని చెప్పారు. చంద్రబాబు రైతులను ముంచేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారని, విత్తనాల సరఫరా కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. మూడు లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రైతులకు సరఫరా చేసామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విత్తనాలు కొని.. రైతులకు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం సేకరణ డబ్బులు కూడా గత చంద్రబాబు ప్రభుత్వం దారి మళ్లించి.. వారిని కష్టాల్లోకి నెట్టేసిందని, రైతులకు చేయాల్సిన నష్టం చేసి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కోసం చంద్రబాబు ఊబలాటపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అవకతవకలు, అక్రమాలు ఆధారాలతో సహా ఎండగడతామన్నారు.