ఆధారాలున్నాయి.. చర్చకు సిద్ధం: పేర్ని నాని

13 Jun, 2020 14:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నామంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించడం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. డబ్బుల కోసం టీడీపీ నేతలు ఏ స్థాయిలో దిగజారారో పక్కా ఆధారాలున్నాయని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. మీడియా సమక్షంలో ఆధారాలతో సహా చర్చించడానికి సిద్దంగా ఉన్నామని సవాల్‌ విసిరారు. ప్రధాని నరేంద్ర మోదీ కంటే నేనే సీనియర్‌ అని చంద్రబాబు ప్రగల్బాలు పలికారని మంత్రి పేర్ని నాని గుర్తుచేశారు. (జేసీ బ్రదర్స్‌ చాతుర్యం: స్క్రాప్‌లోనూ స్కాం)

దివాకర్‌ ట్రావెల్స్‌ అక్రమాలపై అన్ని ఆధారాలున్నాయని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌ 4 వాహనాలుగా వారు రిజిస్ట్రేషన్‌ చేయించారని తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనలను జేసీ బ్రదర్స్‌‌ ఉల్లంఘించారని మంత్రి ఆరోపించారు. అశోక్‌ లేలాండ్‌ సంస్థలో మిగిలిన బీఎస్‌ 3 లారీ‌లను కొనుగోలు చేసి కోహిమా రిజిస్ట్రేషన్‌తో కొన్ని వాహనాలను ఏపీకి తీసుకొచ్చారని వివరించారు. రిజిస్ట్రేషన్‌ చేసిన లారీలను బస్సులుగా మార్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని విమర్శించారు. బోగస్‌ ఎన్‌వోపీలు సృష్టించినందుకు కూడా కేసులు నమోదయ్యాయి అని తెలిపారు. అక్రమాలపై అన్ని ఆధారాలున్న చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. (అచ్చెన్న అరెస్ట్‌ తొలి అడుగు మాత్రమే..)

మరిన్ని వార్తలు