విజయవాడ: రేవంత్రెడ్డి వ్యవహారంపై ఏపీ టీడీపీ నేతలు భిన్నసర్వాలు విన్పిస్తున్నారు. ఏపీ టీడీపీ నాయకులు అన్నం పెట్టినవారికి సున్నం పెడుతున్నారని రేవంత్ చేసిన ఆరోపణలతో సైకిల్ పార్టీలో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఆయనపై చర్య తీసుకోవాలని టీడీపీలోని ఒక వర్గం నేతలు అంటున్నట్టు సమాచారం. ఆయనపై చర్యలు తీసుకోకపోతే రేపు పార్టీ అధినేత చంద్రబాబుపైనా విమర్శలు చేసే అవకాశముందని అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది.
రేవంత్ వ్యవహారంలో మౌనంగా ఉండటమే మంచిదని మరో వర్గం అంటున్నట్టు సమాచారం. రేవంత్పై విమర్శలు చేసే ఓటుకు కోట్లు కేసు బయటపడే అవకాశముందన్న భయాన్ని వ్యక్తపరిచినట్టు తెలుస్తోంది. అయితే రేవంత్పై చర్యలు తీసుకుకోకుంటే వివాదం మరింత ముదురుతుందని టీడీపీలోని ఒక వర్గం నాయకులు భావిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఏపీ టీడీపీ సీనియర్ నేతలు ముందుకు రావడం లేదు.