-
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుపై పలు ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, పీడీపీ, డీఎంకేతోపాటు ఎన్డీయే మిత్రపక్షమైన జేడీయూ కూడా కేంద్రం చర్యను వ్యతిరేకించాయి. కాంగ్రెస్ తదితర ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై భగ్గుమంటుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యంగా ఈ విషయంలో బీజేపీకి మద్దతు పలికారు. జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు తాము మద్దతు తెలుపుతామని, ఈ నిర్ణయంతో జమ్మూకశ్మీర్లో శాంతిభద్రతలు, అభివృద్ధి లభిస్తాయని ఆశిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు.
రాజకీయంగా బీజేపీ అంటేనే భగ్గుమనే కేజ్రీవాల్.. ఆర్టికల్ 370 విషయంలో కేంద్రానికి మద్దతుగా నిలువడం అనూహ్య పరిణామమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీని గుప్పిట్లో పెట్టుకొని.. లెఫ్టినెంట్ గవర్నర్ సాయంతో బీజేపీ అధికారాలు చెలాయిస్తుందని, ప్రజలు ఎన్నకున్న తమ ప్రభుత్వం పనిచేయకుండా బీజేపీ మోకాలడ్డుతోందని కేజ్రీవాల్, ఆప్ నిత్యం విరుచుకుపడే సంగతి తెలిసిందే.