సాక్షి, న్యూఢిల్లీ : కీలకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ఆద్మీ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించిన కేజ్రీవాల్.. విద్యార్థులకు కూడా ఆ పథకాన్ని వర్తించే విధంగా రూపకల్పన చేశారు. అలాగే 24 గంటలు త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి చిన్నారికీ ప్రపంచ స్థాయి ఉచిత విద్య, ఢిల్లీ వ్యాప్తంగా ఆరోగ్యకరమైన వాతావరణం, కాలుష్యం నియంత్రణ, క్లీన్ యమునా, వైద్య, ఆరోగ్యంలో కీలక సంస్కరణలు మరికొన్ని ప్రజాకర్షణ పథకాలతో కూడిన మేనిఫెస్టోను కేజ్రీవాల్ ఆదివారం విడుదల చేశారు. మరోసారి తమకు అధికారం అప్పగిస్తే.. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని అన్నారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. (మా నాన్నను గెలిపించండి: సీఎం కుమార్తె)