నిజామాబాద్ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిజామాబాద్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఖిల్లా రోడ్డులోని ఒక ఫంక్షన్ హాల్లో యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. నగరంలోని ఖిల్లా ఈద్గా మైదానంలో సాయంత్రం 6 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సభకు బీజేపీయేతర అన్ని రాజకీయ పార్టీలతో పాటు ముస్లిం సంస్థల ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు రానున్నట్లు చెప్పారు.
సభకు హాజరుకానున్న అసదుద్దీన్, ప్రశాంత్రెడ్డి
ఈ సభకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో పాటు, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తారని నిర్వహకులు చెప్పారు. ఎన్నార్సీ, సీఏఏను ఉపసంహరించుకునేంత వరకు ఐక్యంగా ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ఎన్పీఆర్ను కూడా తాము వ్యతిరేకిస్తున్నమని తెలిపారు. మోదీ ప్రభుత్వం ద్వంద్వ విధానాలను అనుసరిస్తుందని విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీలను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. దీనిని అమలు చేయబోమని సీఎం కేసీఆర్ ప్రకటించాలని కోరారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉర్దు అకాడమీ చైర్మన్ మహ్మద్ రహీం అన్సారీ, యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మునీరుద్దీన్ ముక్తార్, జిల్లా కన్వీనర్ హఫిజ్లయాఖ్న్, మౌలానా వరియుల్లాఖాన్సి, పెద్ది వెంకట్రాములు, భూమయ్య, రఫత్ఖాన్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఐక్యకార్యాచరణ సమితి నాయకులు
సభకు భారీ బందోబస్తు
నిజామాబాద్లో శుక్రవారం ఖిల్లా వద్ద ఈద్గాలో జరిగే బహిరంగ సభకు సుమారు వేయి మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు. గురువారం రాత్రి వరకు సభ నిర్వహణపై పోలీసులతో సీపీ సమావేశం నిర్వహించారు. మెదక్, కామారెడ్డి, సిద్దిపేట నుంచి పోలీసులు బందోబస్తుకు వస్తున్నారు.