హోదాకు లేని డబ్బు ఎన్‌పీఆర్‌కు ఎక్కడి నుంచి వచ్చాయి?

10 Feb, 2020 01:50 IST|Sakshi

ప్రధాని మోదీపై అసదుద్దీన్‌ ఒవైసీ ధ్వజం

కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగితే డబ్బు లేదని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. అస్సాంలో ఎన్‌పీఆర్‌ అమలు కోసం రూ. 65 వేల కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా ఆదివారం రాత్రి కర్నూలులో లతీఫ్‌లావుబాలీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ముస్లింలను భారతదేశ పౌరులుగా చూస్తున్నామంటూ ఒకవైపు బహిరంగ సభల్లో చెబుతున్న మోదీ.. మరోవైపు వారిపై పరోక్షంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముస్లింల కోసం ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్‌ కేసు సుప్రీం కోర్టులో త్వరలో విచారణకు రానుందని, ముస్లింల అభ్యున్నతికి ఉపకరించే ఆ బిల్లుపై మంచి న్యాయవాదులను పెట్టి వాదించాలని తాను ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, ఎంపీ విజయసాయిరెడ్డికి సూచించానని తెలిపారు. తన ప్రతిపాదనపై వారు సానుకూలత వ్యక్తం చేశారన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెపుతున్నానని చెప్పారు. అలాగే ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా కేరళ తరహాలో తీర్మానం చేయాలని ముఖ్యమంత్రిని కోరతానన్నారు. కార్యక్రమంలో కర్నూలు శాసనసభ్యుడు హఫీజ్‌ఖాన్, జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు రహీముద్దీన్‌ అన్సారి, వివిధ దర్గాల అధిపతులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు