ఒవైసీపై రాజాసింగ్‌ సంచలన ఆరోపణలు

3 Jun, 2019 09:23 IST|Sakshi

ఉగ్రవాదులకు నిధులు మళ్లిస్తున్నారంటూ ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: ఎంఐఎం అధినేత, స్థానిక ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఉగ్రవాదులకు అసదుద్దీన్‌ నిధులు మళ్లిస్తూ.. ఆర్థిక సహాయం చేస్తున్నారని ఆరోపించారు. ‘‘హైదరాబాద్‌ నగరంలో ఉగ్రమూలాలు ఉన్నాయనడానికి కారణం ఒవైసీనే. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ పరిధిలో వివిధ దేశాలకు చెందిన ఏడు వేల ముస్లింలు నివశిస్తున్నారు. వారందరికీ ఆయనే ఆశ్రయం కల్పిస్తున్నారు. ఓల్డ్‌ సిటీలో ఒవైసీపై వ్యతిరేకంగా చాలా వరకు ఉంది. 2024లో హైదరాబాద్‌ ఎంపీ స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకోవడం ఖాయం. ఆయన ఓటమితోనే ఎంఐఎం కనుమరుగవుతుంది’’ అని అన్నారు.

ముస్లిం ప్రజలకు ఒవైసీపై కన్నా.. ప్రధాని మోదీపైనే ఎక్కువ నమ్మకం కలిగి ఉన్నారని రాజాసింగ్‌ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో అక్రమంగా నివశిస్తున్న ముస్లింలను బయటికి పంపేందుకు ఎన్‌ఆర్‌సీ చట్టాన్ని ఇక్కడ కూడా అమలుచేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.  కాగా ఉగ్రవాదులకు హైదరాబాద్‌ సేఫ్‌ జోన్‌ అంటూ కేంద్రమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఉగ్రమూలాలు ఉన్నాయంటూ కిషన్‌ రెడ్డి చేసిన కాంమెట్లను తాను ఏకభవిస్తానని రాజాసింగ్‌ స్పష్టం చేశారు. ఆయన ఆరోపణలపై పలు వర్గాల నుంచి విమర్శలు రాగా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆయనను మందలించారు. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ షా సూచించారు. అలాంటి వ్యాఖ్యలే ఈసారి రాజాసింగ్‌ చేశారు.

మరిన్ని వార్తలు