కాంగ్రెస్‌, బీజేపీలపై నిప్పులు చెరిగిన ఒవైసీ

7 Oct, 2019 09:10 IST|Sakshi

ముంబై: దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని.. కాల్షియం ఇంజెక్షన్‌ ఇచ్చినా.. ప్రయోజనం ఉండదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశ రాజకీయాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీలో జవసత్వాలు పూర్తిగా నశించాయి. అందుకే ఆ పార్టీ మహారాష్ట్ర, హరియాణ అసెంబ్లీ ఎన్నికల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకీ కాల్షీయం ఇంజెక్షన్‌లు ఇచ్చినా దండగే’ అని ఒవైసీ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో బీజేపీపై కూడా అసదుద్దీన్‌ విమర్శల వర్షం కురిపించారు.

ఇక మీదట ఎవరైనా వ్యక్తి మతం మార్చుకోవాలంటే.. నెల రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాల్సిందేనంటూ హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం నూతన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఒవైసీ దీనిని ఉంటకిస్తూ.. హిమాచల్‌కు మాత్రమే పరిమితమైన ఈ బిల్లును మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేయడం కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ మహారాష్ట్రలో రెండు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు