‘ముస్లింలు అందరూ టీఆర్‌ఎస్‌కే ఓటేయాలి’ 

2 Dec, 2018 03:28 IST|Sakshi

హైదరాబాద్‌ : ముస్లింలు తప్పనిసరిగా టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి బీజేపీ, కాంగ్రెస్‌లకు గుణపాఠం చెప్పాలని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ చేపట్టిన పథకాలే మరోసారీ కేసీఆర్‌ను సీఎంను చేస్తాయని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి భోలక్‌పూర్‌లో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ముషీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఠా గోపాల్‌కు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

మైనార్టీల సంక్షేమానికి, పేద కుటంబాల పిల్లలు విద్యను అభ్యసించేందుకు 201 రెసిడెన్షియల్‌ మైనార్టీ పాఠశాలలు ఏర్పాటు చేసి 50 వేల మంది ముస్లిం పిల్లలు చదువుకోవడానికి అవకాశం కల్పించారని కేసీఆర్‌ను కొనియాడారు. ముస్లింలు విదేశాల్లో చదివేందుకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడంతో సుమారు 900 మంది విద్యార్థులు వివిధ దేశాల్లోని యూనివర్సిటీల్లో విద్యనభ్యసిస్తున్నారని గుర్తుచేశారు. రాహుల్‌గాంధీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు తెలంగాణకు ఇప్పటి వరకు ఏం చేశారో తెలపాలని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ నాలుగున్నరేళ్ల పాలనలో ఎలాంటి మతఘర్షణలు జరగలేదని గుర్తుచేశారు. ముస్లింలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఠా గోపాల్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

మరిన్ని వార్తలు