సాక్షి, అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో అధికార టీడీపీలో అసంతృప్తులు పెరిగిపోతున్నారు. ఈ జాబితాలోకి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్గజపతి రాజు కూడా చేరినట్టు కనబడుతోంది. చంద్రబాబు అధ్యక్షతన శనివారం జరిగిన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశానికి అశోక్గజపతి రాజు హాజరుకాకపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. చంద్రబాబుపై ఆయన అలిగినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. తన పార్లమెంట్ పరిధిలో ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి అశోక్గజపతి రాజు రాకపోవడానికి కారణం ఇదేనని సమాచారం.
కిశోర్ చంద్రదేవ్ వ్యవహారం కూడా చంద్రబాబు, అశోక్గజపతి మధ్య దూరం పెరగడానికి మరో కారణమన్న వాదన కూడా ఉంది. కిశోర్ చంద్రదేవ్ను టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం గురించి తనతో చంద్రబాబు చర్చించకపోవడం అశోక్గజపతికి కోపం తెప్పించిందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పొలిట్బ్యూరో సమావేశానికి ఆయన గైర్హాజరైనట్టు తెలుస్తోంది.