‘చేతి’లో నాలుగు రోజుల సమయం ఉండటంతో

18 Jul, 2020 14:22 IST|Sakshi

జైపూర్‌: అసమ్మతి​ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పంచాయితీ కోర్టుకు చేరడంతో రాజస్తాన్‌ రాజకీయాల్లో వేడి కాస్త తగ్గుముఖం పట్టింది. స్పీకర్‌ అనర్హత నోటీసులపై సచిన్‌ పైలట్‌, అతని వర్గం ఎమ్మెల్యేలు 18 మంది హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ కేసు విచారణను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ విచారించింది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఆ అనర్హత నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పీకర్‌ హైకోర్టుకు విన్నవించారు. అనంతరం కేసు విచారణ సోమవారం ఉదయానికి వాయిదా పడింది. దీంతో ఈ నాలుగు రోజుల సమయాన్ని జైపూర్‌లోని ఫెయిర్‌మాంట్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్లో బస చేస్తున్న సీఎం అశోక్‌ గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేలు సరదాసరదాగా గడుపుతున్నారు. 

అంతా ఓకే.. కానీ, కోవిడ్‌ నిబంధనలు
ఉదయం లేవగానే చాలా మంది ఎమ్మెల్యేలు యోగాలో మునిగిపోయారు. కొందరు మహిళా ఎమ్మెల్యేల హోటల్‌ చీఫ్‌ చెఫ్‌తో చేరి పిజ్జా, బట్టర్‌ పన్నీర్‌ చేయడం నేర్చుకున్నామని చెప్తున్నారు. ఇక సభ్యుల కోసం 1960లో వచ్చిన సూపర్‌ హిట్‌ మూడీ మొఘల్‌ ఏ ఆజం సినిమాను ప్రదర్శించామని హోటల్‌ వర్గాలు తెలిపాయి​. అయితే, ఎమ్మెల్యేలెవరూ మాస్కులు ధరించకుండా ఉండటం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన వారు ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 
(చదవండి: వైరల్‌: గుండు కొట్టించి.. జై శ్రీరాం నినాదాలు)
ఇదిలాఉండగా.. హైకోర్టులో కేసు విచారణ అనంతరం అసలు కథ మొదలు కానుంది. సచిన్‌ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత అమలైతే అసెంబ్లీలో మేజిక్‌ ఫిగర్‌ సంఖ్య తగ్గిపోనుంది. దాంతో అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం సులభంగా విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తుంది. ఒకవేళ సచిన్‌ వర్గానికి విశ్వాస పరీక్షలో ఓటు వేసే అవకాశం గనుక వస్తే... కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. అయితే, తమకు 106 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కాంగ్రెస్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే నిజమైతే రాజస్తాన్‌లో ప్రస్తుతానికి రాజకీయ సంక్షోభం ముగింపు దశకు చేరుకున్నట్టే. 200 సభ్యులున్న రాజస్తాన్‌ అసెంబ్లీలో ప్రభుత్వ మనుగడకు 101 ఎమ్మెల్యేల బలం అవసరం.
(రాజస్తాన్‌ హైడ్రామా: పోలీసులకు బీజేపీ ఫిర్యాదు)

మరిన్ని వార్తలు