కేజ్రీవాల్‌కి షాక్‌.. సీనియర్‌ నేత రాజీనామా

15 Aug, 2018 12:12 IST|Sakshi
ఆశుతోష్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కి దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, ప్రముఖ జర్నలిస్ట్‌ అశుతోష్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్లన పార్టీకి నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ట్వీట్‌ చేశారు. కేజ్రీవాల్‌కి అత్యంత సన్నిహితుడైన అశుతోష్‌.. ప్రస్తుతం పబ్లిక్‌ అఫైర్స్‌ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఉన్నారు. గత రెండు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆశుతోష్‌.. అనూహ్య నిర్ణయంతో పార్టీ నేతలు షాక్‌ తిన్నారు.

గత ఎన్నికల్లో ఢిల్లీలోని ఛాందిని చౌక్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఢిల్లీ నుంచి రాజ్యసభకు ఎన్నికవుతారంటూ వార్తలు వచ్చినా కేజ్రీవాల్‌ ఆయన స్థానంలో మరోకరికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆప్‌తో తన ప్రయాణం ఇక ముగిసిందని, తనకు అండగా నిలిచిన పార్టీ శ్రేణులందరికీ ధన్యావాదాలని ట్విటర్‌లో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అశుతోష్‌ రాజీనామా పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు