కాంగ్రెస్, బీజేపీ దొందు దొందే
సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత ఒవైసీ
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బీఫ్ బిర్యానీ తిని పడుకున్నారా? అని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘భారత వాయు సేన బాల్కోట్లోని ఉగ్రస్థావరాలపై బాంబులు వేసింది. ఈ దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు హతమయ్యారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అంటే.. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాత్రం ఎన్టీఆర్పీ 300 ఫోన్లను ట్యాప్ చేసిందంటారు. బాలకోట్లో 300 ఫోన్లు కనిపించిన మీకు.. ఓ ఉగ్రవాది 50 కేజీల ఆర్డీఎక్స్ను పుల్వామాకు తరలించడం మాత్రం కనిపించదు. ఏ ఎందుకు.. అప్పుడు బీఫ్ బిర్యాని తిని పడుకున్నారా?’ అని మండిపడ్డారు.
తన పోరాటం సెక్యులరిజం,సోదర భావాన్ని అంతం చేయాలనుకునే వారిపైనేనని స్పష్టం చేశారు. ‘ఎవరినైనా జాతీయ పార్టీలు ఎన్నని అడిగితే రెండు లేదా మూడు అని చెబుతారు. కానీ నేను మాత్రం ఒక్కటే జాతీయపార్టీ ఉందని అది బీజేపీ అంటాను. ఎందుకంటే కాంగ్రెస్ కూడా 1.5 బీజేపీనే. రెండు పార్టీలకు ఎలాంటి వ్యత్యాసం లేదని, రెండు ఒకటేని ’ అని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.