బ్రేకింగ్‌: అటల్‌జీ అస్తమయం!

16 Aug, 2018 14:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) కన్నుమూశారు. ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై ఉండి చికిత్స పొందిన ఆయన గురువారం సాయంత్రం 5.05 గంటలకు తుదిశ్వాస విడిచారు. వాజ్‌పేయి కన్నుమూసిన నేపథ్యంలో లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవి..

 ఎయిమ్స్‌ నుంచి నివాసానికి వాజ్‌పేయి పార్థీవదేహం

  • వాజ్‌పేయికి నివాళులు అర్పించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సంగ్‌.
  • ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయడు, ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌, నితీష్‌ కుమార్‌ తదితరులు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు.
  • మాజీ ప్రధాని వాజ్‌పేయి పార్థీవదేహాన్ని ప్రత్యేక కన్వాయ్‌లో ఎయిమ్స్‌ నుంచి ఆయన నివాసానికి తరలించారు. వాజ్‌పేయి నివాసానికి ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు తరలివచ్చిన సంగతి తెలిసిందే.

రేపు అంత్యక్రియలు

  • వాజ్‌పేయి కన్నుమూసిన నేపథ్యంలో ఈ నెల 22వ తేదీ వరకు ఏడు రోజులు సంతాపదినాలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వాజ్‌పేయి మృతికి సంతాపంగా భారతీయ జెండాను సగం వరకు అవతనం చేయనున్నారు. కాసేపట్లో ఆయన పార్థీవదేహాన్ని కృష్ణమీనన్‌ మర్గంలోని నివాసానికి తరలించనున్నారు. శుక్రవారం ఉదయం అభిమానుల సందర్శనార్థం వాజ్‌పేయి భౌతికకాయాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం ఐదు గంటలకు యమునా నది ఒడ్డున స్మృతిస్థల్‌లో వాజ్‌పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. పూర్తి కథనాన్ని ఇక్కడ చదవండి: రేపు విజయ్‌ ఘాట్‌లో వాజ్‌పేయి అంత్యక్రియలు
     

అటల్‌జీ.. మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు: ఎన్టీఆర్‌

  • మన దేశాన్ని పాలించిన గొప్ప నేతల్లో ఒకరైన వాజ్‌పేయికి సెల్యూట్‌ సమర్పిస్తున్నాను. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, సాహసోపేతమైన జాతీయవాది, దేశాన్ని అనుసంధానం చేసిన స్వర్ణ త్రిభుజి రహదారి రూపకర్త. అటల్‌జీ మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు- ట్విటర్‌లో జూనియ్‌ ఎన్టీఆర్‌
    చదవండి: వాజ్‌పేయి మృతి పట్ల టాలీవుడ్‌ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి.. నివాళులు
     
  • వాజ్‌పేయి ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు. ఆయన మృతి ఎంతో బాధ కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి : రజనీకాంత్‌  
  • మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందంటూ ఆయన వాజ్‌పేయికి ఘననివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వాజ్‌పేయి ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు.

క్విట్‌ ఇండియా ఉద్యమంలో అరెస్టయిన ఓ యువకుడు..
పద్దెనిమిదేళ్ల వయసులోనే క్విట్‌ ఇండియా ఉద్యమంలో అరెస్టయిన ఓ యువకుడు ఆ తర్వాత దేశరాజకీయాల్లో గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరుగాంచాడు. బీజేపీ అంటేనే ఆయన అన్నంతగా ఎదిగాడు. దాదాపు ఆరేడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎత్తు,పల్లాలు చవిచూశాడు. బీజేపీ పట్ల, ఆ పార్టీ రాజకీయాల పట్ల కేడర్‌ ఆకర్షితులయ్యేందుకు ఆయన ఇమేజీ ఎంతగానో పనిచేసింది. హాస్య చతురత మేళవించిన ప్రసంగాలతో పాటు ఆవేశపూరిత ఉపన్యాసాలకు ఆయన పెట్టింది పేరు.. ఆయనే వాజ్‌పేయి.. ఆయన జీవితంలోని కీలక విశేషాలివి.. చదవండి: వాజ్‌పేయి జీవన ప్రస్థానంలో ముఖ్య ఘట్టాలు ...!

శోకసంద్రంలో అభిమానులు!
భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి ఇకలేరు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాజ్‌పేయి గురువారం కన్నుమూశారు.  రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఎయిమ్స్‌ వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. గురువారం సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్‌ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో బీజేపీ శ్రేణులు, అటల్‌జీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పూర్తి కథనాన్ని చదవడం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి: వాజ్‌పేయి కన్నుమూత.. శోకసంద్రంలో అభిమానులు!

 


వాజ్‌పేయి మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..


 

ఎయిమ్స్‌లో వాజ్‌పేయి చికిత్సకు సంబంధించిన పరిణామాలివి..

  • ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా గురువారం సాయంత్రం మీడియాకు తెలిపారు. అంతకుముందు వాజ్‌పేయిని పరామర్శించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని రాజ్‌నాథ్‌ మీడియాకు తెలిపారు.
  • వాజ్‌పేయి నివాసానికి మోదీ, అమిత్‌ షా, కేంద్రమంత్రులు చేరుకున్నారు. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున వాజ్‌పేయి నివాసానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ట్రాపిక్‌ ఆంక్షలు విధించారు.
  • బీజేపీ పాలిత ముఖ్యమంత్రులందరూ ఢిల్లీకి రావాలని అధిష్టానం ఆదేశం..
  • ఎయిమ్స్‌కు చేరుకున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరుఖ్‌ అబ్దుల్లా
  • గ్వాలియర్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన వాజ్‌పేయి బంధువులు
  • ఎయిమ్స్‌లో దాదాపు గంటసేపు గడిపిన ప్రధాని మోదీ
  • వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్‌ వైద్యులతో చర్చించిన ప్రధాని మోదీ, అమిత్‌ షా
     
  •  బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ హుటాహుటిన ఢిల్లీకి వచ్చారు. ఆయనతోపాటు మహారాష్ట్ర, రాజస్థాన్‌ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్‌, వసుంధరారాజే కూడా ఎయిమ్స్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయిని పరామర్శించనున్నారు.
     
  • ఉప రాష్టపతి వెంకయ్య నాయుడు.. ఎయిమ్స్‌ చేరుకుని వాజ్‌పేయి ఆరోగ్యం ఆరా తీశారు. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఎయిమ్స్‌కు చేరుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో పాటు ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా, పీయూష్‌, హర్షవర్ధన్‌, సురేష్‌ ప్రభు, జితేంద్ర సింగ్‌, అశ్విన్‌ కుమార్‌ చౌబే, సురేష్‌ ప‍్రభు, ఢిల్లీ సీఎం అరవింద్‌ క్రేజీవాల్‌లు వాజ్‌పేయిని పరామర్శించిన వారిలో ఉన్నారు. అమిత్‌ షా, జేపీ నడ్డాలు ఎయిమ్స్‌లో ఉండి వాజ్‌పేయి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పడు వాకబు చేస్తున్నారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉండటంతో బీజేపీ తన అధికారిక కార్యక‍్రమాల్ని వాయిదా వేసుకుంది. జూన్‌ 11 నుంచి ఎయిమ్స్‌లో వాజ్‌పేయి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మూత్రనాళ ఇన్ఫెక్షన్, ఛాతీలో ఇబ్బంది.. తదితర అనారోగ్య కారణాలతో వాజ్‌పేయి గత రెండు నెలల నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

    ఎయిమ్స్‌ వైద్య బృందం పర్యవేక్షణ

  • ఆయన ఆరోగ్యాన్ని ఎయిమ్స్‌ వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. బుధవారం సాయంత్రానికి వాజ్‌పేయి ఆరోగ్యం మరింత క్షీణించగా, గురువారం ఉదయానికి విషమంగా మారింది. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలోని 15 మంది వైద్యుల బృందం వాజ్‌పేయికి చికిత్స అందిస్తోంది. ఒక ప్రత్యేకమైన వార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వాజ్‌పేయి  ఆరోగ్యంపై ఆందోళన నెలకొనడంతో కేంద్ర మంత్రులతో పాటు పలువురు అగ్రనేతలు ఒక్కొక్కరిగా ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు