...అందుకే మోదీని తప్పించలేదు

11 May, 2019 04:20 IST|Sakshi

అడ్వాణీ రాజీనామా చేస్తాననడంతో వాజ్‌పేయి వెనక్కి తగ్గారన్న యశ్వంత్‌సిన్హా  

భోపాల్‌: 2002లో గుజరాత్‌ అల్లర్ల నేపథ్యంలో అప్పటి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి సీఎం మోదీని రాజీనామా కోరాలని నిర్ణయించుకున్నారని బీజేపీ మాజీ నేత యశ్వంత్‌ సిన్హా తెలిపారు. ఒకవేళ మోదీ రాజీనామా చేయకుంటే ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలనుకున్నట్లు వెల్లడించారు. అయితే అప్పటి హోంమంత్రి అడ్వాణీ బెదిరింపులకు దిగడంతో వాజ్‌పేయి వెనక్కి తగ్గారని పేర్కొన్నారు.  ‘గోవాలో 2002లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశంలో మోదీ రాజీనామా కోరాలని వాజ్‌పేయి నిర్ణయించుకున్నారు.

అయితే మోదీని తప్పిస్తే తాను హోంమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అడ్వాణీ హెచ్చరించారు. దీంతో వెనక్కి తగ్గిన వాజ్‌పేయి మోదీని గుజరాత్‌ ముఖ్యమంత్రిగా కొనసాగించారు’ అని చెప్పారు. ‘ఐఎన్‌ఎస్‌ విరాట్‌’ నౌకలో రాజీవ్‌ కుటుంబం విహరించడంపై అప్పటి నేవీ అధికారులు స్పష్టత ఇచ్చినందున దీనిపై మాట్లాడటం అనవసరమని అభిప్రాయపడ్డారు. మోదీ తన ఎన్నికల ప్రచారంలో మాటిమాటికీ పాకిస్తాన్‌ను ప్రస్తావిస్తున్నారనీ, పాక్‌తో మనకు పోటీయా? అని ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు