నారా నీడలో నోరు పెగల్లేదా?

30 Jun, 2020 04:36 IST|Sakshi

చంద్రబాబు హయాంలో కాపుల సంక్షేమానికి కేటాయించిన నిధులే తక్కువ

కాపులకు అమలు చేసిన అన్ని పథకాలకు కాపు కార్పొరేషన్‌ నుంచే ఖర్చు 

కార్పొరేషన్ల నుంచి ఆయా వర్గాల సంక్షేమ పథకాలకు నిధులు ఇవ్వడం సాధారణమే

అప్పుడు ప్రశ్నించని పవన్‌కల్యాణ్‌.. ఇప్పుడు ప్రశ్నించడంపై కాపుల నుంచే వ్యతిరేకత

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కాపులకు భారీగా నిధులు కేటాయించడం కనిపించలేదా అని మండిపాటు 

అప్పుడు లేవని నోరు.. ఇప్పుడు ఎవరి కోసం లేస్తోందని నిలదీత

కాపులకు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని బాబు 2014 ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక బాబు ప్రభుత్వం మొత్తం ఐదేళ్ల కాలంలో కాపు కార్పొరేషన్‌ ద్వారా రూ.1,874.67 కోట్లు ఇచ్చింది. 2,54,335 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చింది. 

సాక్షి, అమరావతి: ‘ఏ ప్రభుత్వమైనా కార్పొరేషన్లకు కేటాయించిన నిధుల నుంచి సంక్షేమ పథకాలకు నిధులను ఖర్చు చేస్తుంది. కాపు కార్పొరేషన్‌ కూడా అంతే. గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం.. కాపుల సంక్షేమానికి కాపు కార్పొరేషన్‌ ద్వారానే నిధులు కేటాయించింది. చంద్రబాబు ప్రభుత్వం కాపు సంక్షేమానికి చేసిన కేటాయింపులు, పెట్టిన ఖర్చు బాగా తక్కువ. ఆ నిధులను కూడా కాపు కార్పొరేషన్‌ నుంచి ఖర్చు చేసింది. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక కాపుల సంక్షేమానికి కేటాయింపులు ఊహించనంతగా పెరిగాయి. ఈ ప్రభుత్వం 13 నెలల్లోనే రూ.4,769 కోట్లకుపైగా ఖర్చు చేసింది. 22.89 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది.

ఈ విషయాన్ని మరిచిపోయి పవన్‌కల్యాణ్‌ లాంటి వారు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వం కూడా కాపుల కోసం చేసిన వ్యయాన్ని కాపు కార్పొరేషన్‌ నుంచే చేశారనే విషయాన్ని పవన్‌ ఉద్దేశ పూర్వకంగా ప్రస్తావించట్లేదు. అప్పుడు ఏమీ మాట్లాడని పవన్, ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. జగన్‌ ప్రభుత్వం కాపుల సంక్షేమానికి నిధుల కేటాయింపు పెంచిన విషయాన్ని పక్కనపెట్టి.. కాపు కార్పొరేషన్‌ నుంచి నిధులు ఇస్తుండటం తప్పన్నట్లుగా మాట్లాడుతున్నారు’ అని పవన్‌కల్యాణ్‌ తీరుపై కాపులు మండిపడుతున్నారు. 

ఎక్కువ నిధులు ఇచ్చినందుకు బాధా?
కాపు సంక్షేమ పథకాలకు కాపు కార్పొరేషన్‌ నుంచి నిధులు వ్యయం చేయడం చంద్రబాబు హయాంలో కొనసాగింది. అదే ఇప్పుడూ కొనసాగుతోంది. కాపు కార్పొరేషన్‌ నుంచి నిధులను వారి సంక్షేమ పథకాలకు చంద్రబాబు ఖర్చు చేసినప్పుడు మౌనంగా ఉన్న పవన్‌కల్యాణ్‌.. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? కాపులను నిలువునా ముంచింది చంద్రబాబే. అటువంటి చంద్రబాబును ఒక్క మాట కూడా అనని పవన్‌కల్యాణ్‌.. కాపుల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం బాధాకరం. కాపు కార్పొరేషన్‌ ద్వారా ఏడాదికి రూ.2 వేల కోట్లు ఇస్తానని హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌.. ఏడాదిలో వివిధ పథకాల ద్వారా రూ.4 వేల కోట్లకుపైగా కాపులకు ఖర్చుపెట్టారు. ఇది పవన్‌ కల్యాణ్‌కు కనిపించదా? లేక ఎక్కువ ఖర్చు పెట్టినందుకు బాధా?
– అవంతి శ్రీనివాస్, పర్యాటక శాఖ మంత్రి

చంద్రబాబుతో కుమ్మక్కు రాజకీయమిది
కాపుల గురించి మాట్లాడే అర్హత పవన్‌ కల్యాణ్‌కు లేదు. టీడీపీ హయాంలో చంద్రబాబు కాపులకు చేసిన అన్యాయాన్ని ఆయనెప్పుడూ ప్రశ్నించలేదు. కాపు కార్పొరేషన్‌ నుంచే చంద్రబాబు కాపులకు అన్ని పథకాలకు నిధులు ఇచ్చారు. ఆ నిధులన్నీ అరకొరే. కాపు కార్పొరేషన్‌ ద్వారా ఏటా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కినా పట్టించుకోలేదు. ముద్రగడ పద్మనాభం విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు కాపులెవరూ మర్చిపోలేదు. ఆయన కుటుంబాన్ని చంద్రబాబు పోలీసుల ద్వారా తీవ్ర మానసిక వ్యథకు గురిచేశారు. ఆ సమయంలో కాపులంతా పార్టీ రహితంగా బాధపడ్డారు. అప్పుడు పవన్‌కు ముద్రగడ కాపు కులస్తుడని గుర్తుకు రాలేదా? వైఎస్‌ జగన్‌ మేనిఫెస్టోలో కాపునేస్తం గురించి ప్రకటించకపోయినా అమలు పరిచి మహిళలకు ఆర్థిక సాయం చేశారు. పవన్‌ ఇవన్నీ తెలుసుకుంటే మంచిది.    
    – కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే

బాబు డైరెక్షన్‌.. పవన్‌ యాక్షన్‌
చంద్రబాబు కార్యాలయం నుంచి వచ్చే ప్రెస్‌నోట్లు వల్లెవేసే పవన్‌కు కాపుల అభ్యున్నతికి సీఎం జగన్‌ చేస్తున్న కార్యక్రమాలు కనిపించవు. తెలుగుదేశం హయాంలో కాపు కార్పొరేషన్‌ నిధులను ‘పసుపు–కుంకుమ’కు మళ్లించారు. అప్పుడు మాట్లాడని పవన్‌ కల్యాణ్‌.. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? రిజర్వేషన్‌పై ఉద్యమం చేయాలంటే పవన్‌ కల్యాణ్‌ కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమం చేసి సాధించాలి. భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నా, పెంచాలన్నా భారత పార్లమెంటులో 2/3 మెజార్టీ సభ్యులతో తీర్మానం చేసి 9వ షెడ్యూల్లో చేర్పించాలి. ఈ ప్రక్రియపై రాష్ట్రపతి ఆమోదం తెలియజేయాలి. కాపుల రిజర్వేషన్‌ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తే సంతోషిస్తాం.
– నరహరశెట్టి శ్రీహరి, జాతీయ కాపు సమాఖ్య అధ్యక్షుడు

మరిన్ని వార్తలు