సాక్షి, హైదరాబాద్: ఆత్మ గౌరవం చంపుకోలేక టీడీపీని వదిలిపెట్టినట్టు ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు తెలిపారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు విధానాలు నచ్చక అధికార పార్టీని వీడామని, తమ స్వార్థం కోసం పార్టీ మారలేదని స్పష్టం చేశారు. మోసపూరి విధానాలతో చంద్రబాబు పదేపదే ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. కులాలను విభజించి తిట్టించడం ద్వారా చంద్రబాబు ఆనందం పొందుతారని విమర్శించారు. కులాల పేరుతో విమర్శించుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. తాము అడిగిన దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యేక హోదాపై ఎందుకు యూటర్న్ తీసుకున్నారని ప్రశ్నించారు. చెప్పింది చేయడం చంద్రబాబుకు అలవాటు లేదన్నారు. తమపై విమర్శలు చేస్తే తిప్పికొడతామన్నారు.
వైఎస్ జగన్ మొదటి నుంచి ఒకేమాట మీద ఉన్నారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. వైఎస్ జగన్ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా నమ్ముతున్నారని శ్రీనివాసరావు అన్నారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తాము నడుచుకుంటున్నామని చెప్పారు. (వైఎస్సార్సీపీలో చేరిన మరో టీడీపీ ఎంపీ)