ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్తా

29 May, 2019 04:36 IST|Sakshi
కేకును కట్‌ చేస్తున్న బాలకృష్ణ దంపతులు

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

హిందూపురం: కొత్తగా ఏర్పడిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తానని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత బాలకృష్ణ, వసుంధర దంపతులు మొదటిసారిగా నియోజకవర్గానికి విచ్చేశారు. వారికి పార్టీ నాయకులు, అభిమానులు స్వాగతం పలికారు. మంగళవారం ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఎస్‌బీఐ, గురునాథ్‌ సర్కిళ్లలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాలకు బాలకృష్ణ పూలమాలలు వేసి కేకును కత్తిరించారు.

బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, పార్టీకోసం నిరంతరం కష్టపడిన కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించినప్పటి నుంచి హిందూపురం ప్రజలు పార్టీని ఆదరిస్తూ వస్తున్నారని, రెండోసారి తనను గెలిపించిన హిందూపురం ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు.  అహుడా చైర్మన్‌ అంబికా లక్ష్మినారాయణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు