బాబుకు బాలయ్య వార్నింగ్‌.. మారిన సమీకరణాలు!

13 Mar, 2019 17:15 IST|Sakshi

సాక్షి, అమరావతి: టికెట్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆయన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏకంగా వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. తన చిన్నల్లుడు భరత్‌పాటు కదిరి బాబూరావుకు టికెట్ ఇవ్వాల్సిందేనని బాలకృష్ణ పట్టబుడుతున్నారు. వారికి టికెట్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదని తాజాగా ఆయన బావ చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చినట్టు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

బాలకృష్ణ వార్నింగ్‌తో చంద్రబాబు టికెట్ల కేటాయింపులో పలు మార్పులు చేసినట్టు సమాచారం. విశాఖపట్నం ఎంపీగా బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు విశాఖ, రాజమండ్రిలో ఎదో ఒక సీటు ఇచ్చే యోచనలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ళకు ఒకేచోట సీట్లు ఇవ్వడం బాగోదని భావించిన చంద్రబాబు ఈ మేరకు మార్పులు చేసినట్టు సమాచారం. భరత్ కోసమే లోకేశ్‌ను మంగళగిరి నియోజకవర్గానికి మార్చినట్టు తెలుస్తోంది. మొదట లోకేశ్‌ భీమిలి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇక, బాలకృష్ణ అల్టిమేటంతో కనిగిరి నుండి కదిరి బాబురావుకు మరోసారి సీటు  కేటాయించినట్టు సమాచారం.

బాలకృష్ణ కోసమే మంత్రి శిద్ధా రాఘవరావు సీటుకు చంద్రబాబు ఎసరు పెట్టారు. అంతేకాకుండా కదిరి సీటు ఇస్తానని ఉగ్ర నరసింహరెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ.. మారిన సమీకరణాలతో ఆయనను దర్శికి మార్చాలని నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో జరిగిన ఈ మార్పులకు బాలకృష్ణ కోపమే కారణమని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

మరిన్ని వార్తలు