టీడీపీ వాళ్లు నోరు తెరిస్తే అబద్ధాలు: సీఎం జగన్‌

17 Dec, 2019 12:52 IST|Sakshi

సాక్షి, అమరావతి: గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్‌ అంతరాయాలు తగ్గాయని విద్యుత్‌ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. విద్యుత​ రంగంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్‌ అంతరాయాలపై ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... టీడీపీ సర్కారు హయాంలో విద్యుత్‌ రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా... 2018లో 53,016 ఫీడర్లు ఉండగా... 17320 గంటల పాటు విద్యుత్‌ అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. అయితే 2019 మే నుంచి ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని తెలిపారు. 2019లో 44406 ఫీడర్లు ఉండగా.. 14085 గంటలు మాత్రమే విద్యుత్‌ అంతరాయం కలిగిందని స్పష్టం చేశారు. అదే విధంగా మే నుంచి ఇప్పటిదాకా వివిధ నెలల్లో కలిగిన విద్యుత్‌ అంతరాయాలను, గతేడాది గణాంకాలతో పోలుస్తూ వివరణ ఇచ్చారు. సీఎం జగన్‌ ప్రత్యేక శ్రద్ధతో ప్రస్తుతం రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఏర్పడిందని పేర్కొన్నారు.

కాగా విద్యుత్‌ అంతరాయాలపై టీడీపీ ఆందోళన చేయడంపై సీఎం జగన్‌ అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై తాను వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా.. టీడీపీ సభ్యులు అరవడం మొదలుపెట్టారు. దీంతో సంబంధిత శాఖా మంత్రి వివరణ ఇస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా... ‘ టీడీపీ వాళ్లు నోరు తెరిస్తే అబద్ధాలు. విద్యుత్‌ అంతరాయాల గురించి ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. వాళ్ల అబద్ధాలు బయటపెట్టడానికే డేటా తెప్పించాం. కానీ వాళ్లు వినేందుకు సిద్ధంగా లేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు