గులాబీ గూటికి ‘బండారి’!

11 Sep, 2018 10:45 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న ఉప్పల్‌ కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తలు బండారి లక్ష్మారెడ్డి

టీడీపీ, హస్తం పార్టీ పొత్తుపై ఆగ్రహం

కాంగ్రెస్‌పై లక్ష్మారెడ్డి తిరుగుబావుటా

ఆయనతోపాటు కారెక్కనున్న కాంగ్రెస్‌ నాయకులు

ఉప్పల్‌ నియోజకవర్గంలో హాట్‌హాట్‌ రాజకీయం  

కాప్రా/ఉప్పల్‌: టీడీపీ– కాంగ్రెస్‌ పార్టీ పొత్తుల్లో భాగంగా ఉప్పల్‌ నియోజకవర్గం దాదాపుగా టీడీపీకి కేటాయించనున్నట్లు వార్తలు గుప్పుమనడంతో కాంగ్రెస్‌ నుంచి టిక్కెట్‌ ఆశించిన బండారి లక్ష్మారెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం కార్యకర్తలు, ముఖ్య నాయకులతో ఉప్పల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి బండారి లక్ష్మారెడ్డి సైనిక్‌పురిలోని ఆ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమంలో ఎట్టకేలకు పార్టీ వీడటానికి నిర్ణయం తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన బండారి లక్ష్మారెడ్డి.. ప్రస్తుతం కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ఎంతో ఆశతో వేచి చూసినా.. దాదాపు నిరాశే æఎదురవుతుందన్న సమాచారం మేరకు ఎట్టకేలకు పార్టీని వీడటానికి సిద్ధమయ్యారు. కార్యకర్తలు, ముఖ్య నాయకులతో సుదీర్ఘ మంతనాలు చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.  

12న ముహూర్తం ఖరారు..
ఉప్పల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టిక్కెట్‌ను ఆశించిన బండారి లక్ష్మారెడ్డి  కార్యకర్తలు, అభిమానుల సూచనల మేరకు ఈ నెల 12న గులాబీ గూటికి చేరేందుకు మూహూర్తం ఖరారు చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం నుంచి ఆయనకు సానుకూల సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్‌లో కూడా ప్రకటించిన లిసు ్టలో అభ్యర్థులకు బీ ఫారాలు వచ్చే వరకు నమ్మకం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. చివరి నిమిషంలో అభ్యర్థుల జాబితా తారుమారు కావచ్చనే అనుమానాలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే ఉప్ప ల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నుంచి బండారు లక్ష్మారెడ్డి పోటీకి దిగే అవకాశం లేకపోలేదు.

ఉప్పల్‌లో వేడెక్కిన రాజకీయం..
ఉప్పల్‌ నియోజకవర్గంలో రెండు రోజులుగా రాజకీయాలు వేడెక్కాయి. ఓ పక్క టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ను ఇప్పటికే ఖరారు చేయడం మరోపక్క టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తు, టిక్కెట్‌ ఆశించి భంగపడ్డవారు ప్రెస్‌మీట్‌లలో తమ ఆవేదనను వ్యక్తపరచడం, ఆందోళనలు నిర్వహించడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. సోమవారం వరకు టీడీపీ, కాంగ్రెస్‌ మధ్య పొత్తులు దాదాపు ఖరారు కావడంతో ఉప్పల్‌ నియోజకవర్గం పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఆవేదన చెందిన కాంగ్రెస్‌ నాయకులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. గ్రేటర్‌ పరిధిలో రెండు కార్పొరేటర్‌ టిక్కెట్లను దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ నాచారం కార్పొరేటర్‌ కూడా పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో ఒక్కసారిగా ఉప్పల్‌ రాజకీయాలు వేడెక్కాయి.  

టీడీపీతో పొత్తు దారుణం: బండారి   
కాంగ్రెస్‌ పతనం చేయడానికి స్థాపించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం దారుణమని  బండారు లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉంటూ, పార్టీ కోసం పని చేసిన తన కు ఉప్పల్‌ టికెట్‌ ఇవ్వకపోవడం దారుణమన్నా రు. తనతోపాటు నియోజకవర్గంలో పలువురు నేతలు పార్టీ మారుతున్నట్లు పేర్కొన్నారు.  

వీరు కూడా కారెక్కుతారా..?  
కాప్రా సర్కిల్‌ అధ్యక్షుడు బీఏ రాంచందర్‌గౌడ్, ఉప్పల్‌ సర్కిల్‌ అధ్యక్షుడు మూషం శ్రీనివాస్, నాచారం డివిజన్‌ కార్పొరేటర్‌ శాంతి సాయిజెన్‌ శేఖర్, గ్రేటర్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి సాయిజెన్‌ శేఖర్, 10 డివిజన్ల అధ్యక్షులు, నియోజకవర్గ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు ఇంద్రయ్య, మైనార్టీ అధ్యక్షుడు సర్వర్, ఉప్పల్‌ నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు టిల్లు యాదవ్, ఉప్పల్‌ నియోజకవర్గ యూత్‌ నాయకులు అభిషేక్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌రెడ్డి, 9 డివిజన్ల కంటెస్టెడ్‌ కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు, అన్ని  అనుబంధ సంఘం కమిటీల సభ్యులు కాంగ్రెస్‌కు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు