మునుగోడు బీసీ నేతల ‘తిరుగుబాటు’

20 Sep, 2018 05:22 IST|Sakshi
జాజుల శ్రీనివాస్‌గౌడ్

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం బీసీ నేతలంతా రాజకీయ పార్టీలపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నియోజకవర్గంలో 65 శాతానికి పైగా బీసీ ఓటర్లున్నా ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు అవకాశం ఇవ్వడం లేదంటూ నిరసన గళం విప్పారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గానికి చెందిన దాదాపు 100 మంది బీసీ నేతలు జూబ్లీహిల్స్‌లో బుధవారం రహస్యంగా సమావేశమయ్యారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 65 శాతానికి పైగా బీసీ ఓటర్లున్నా రెండు సామాజిక వర్గాలకే టికెట్లు ఇస్తున్నారన్నారు. బీసీల పక్షాన ఏ ప్రధాన పార్టీ అభ్యర్థిని ప్రకటించినా మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు. లేదంటే బీసీలందరి తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

25న 5 వేల బైక్‌లతో ర్యాలీ
మునుగోడు నియోజకవర్గంలోని పలు పార్టీల నేతలతో 21న రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 25న అందోల్‌ మైసమ్మ దేవాలయం నుంచి 5 వేల మందితో బైక్‌ ర్యాలీ చేపట్టాలని, ఈ నెల 30 లేదా అక్టోబర్‌ 1న చండూరు లేదా మునుగోడులో ‘బీసీల ఆత్మగౌరవ సభ’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. భేటీలో తెలం గాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నేత పల్లె రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు