సాక్షి, సాలూరు: ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో రాజమండ్రికి చెందిన బీసీ సంఘాల రాష్ట్ర జేఏసీ నాయకుడు, శెట్టి బలిజ, గౌడ, ఈడిగ, శ్రీసైన, యాత కులాల రాష్ట్ర అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు, ఆయన తనయుడు మార్గాని భరత్లు పార్టీలో చేరారు. వీరికి కండువా వేసి వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జననేత మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యన్నతికీ వైఎస్సార్సీపీ కృషి చేస్తుందన్నారు. రాజమండ్రి ఎంపీ సీటు బీసీలకు ఇస్తామని ఇదివరకే ప్రకటించామని, ఈ ప్రకటనతో బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయన్నారు. అందులో భాగంగానే బీసీ నేతలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
మార్గాని నాగేశ్వరరావు, భరత్లతో పాటు పార్టీలో చేరిన బీసీ నేతలను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నానన్నారు. బడుగు, బలహీన వర్గాలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు.. అందుకు తగిన కృషి చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాత్కలిక విరామం అనంతరం జననేత ప్రజాసంకల్పయాత్రను పున:ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. జననేతతో అడుగులో అడుగేసెందుకు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
చంద్రబాబుపై భూమన ఫైర్
చంద్రబాబు ప్రభుత్వం రాక్షస రాజకీయానికి పాల్పడుతూ, వికృత క్రీడలు ఆడుతోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. అప్రతిహసంగా కొనసాగుతున్న పాదయాత్రను చూసి ఓర్వలేక... హత్యాయత్నం చేయించారని భూమన ఆరోపించారు. కుట్ర రాజకీయాలను ఛేదించి తిరిగి తమ వద్దకు వచ్చిన వైఎస్ జగన్కు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు.