సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విషజ్వరాలతో మగ్గుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్లు కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు మలేరియా, డెంగీ, ఇతర విషజ్వరాల బారిన పడి అల్లాడిపోతున్నా వారి కళ్లకు కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈటల రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నట్లు అనిపిస్తోందని అన్నారు.
పోటీ చేసిన వారూ రండి!
తమ తమ అసెంబ్లీ పరిధిలో నెలకొన్న సమస్యలతో ఈ నెల 7న జరిగే ప్రత్యేక సమావేశానికి రావాలని, అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై సమగ్ర సమాచారం తీసుకురావా లని భట్టి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన నేతలందరికీ సమాచారం పంపారు. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే సీఎల్పీ పక్షాన ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేశాక బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తామని తెలిపారు.