మీ నిర్ణయం అభినందనీయం 

17 Jun, 2019 02:41 IST|Sakshi

పార్టీ ఫిరాయింపులపై ఏపీ సీఎం జగన్‌కి సీఎల్పీ నేత భట్టి లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామ్య పరిరక్షణకు చీడపురుగులా మారిన ప్రజా ప్రతినిధుల పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వెలిబుచ్చిన అభిప్రాయం పట్ల తాము హర్షం వ్యక్తం చేస్తున్నామని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు జగన్‌కు ఆదివారం ఆయన ఓ లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపులు జరిగితే వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో జగన్‌ చేసిన ప్రసంగంలో చెప్పిన అంశంతో ఏకీభవిస్తున్నామని, ఆ నిర్ణయం అభినందనీయమని భట్టి కొనియాడారు.

తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో ఆదర్శప్రాయంగా నిలవాలని తాము కోరుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావద్దని ఆయన జగన్‌ను కోరారు. సాగునీటి ప్రాజెక్టుల టెండర్లకు సంబంధించిన అన్ని విషయాలను జ్యుడీషియల్‌ కమిషన్‌ ముందుంచుతామని తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నామని చెప్పారు. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులతోపాటు కాళేశ్వరం విషయంలో ఇలాంటి జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని తాము డిమాండ్‌ చేస్తున్నామని, ఈ డిమాండ్‌పై సంపూర్ణ మద్దతు కావాలని భట్టి జగన్‌ను కోరారు.    

మరిన్ని వార్తలు