చచ్చినా పర్వాలేదనుకుంటున్నారా?: భట్టి

10 May, 2020 03:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘పోలీస్‌ కాపలా ఉంచినంత మాత్రాన వైన్‌షాపుల వద్ద భౌతిక దూరం పాటించడం సాధ్యం కాదని, తాగుబోతులకు కరోనా వచ్చి చచ్చినా పర్వాలేదనుకుంటున్నారా?’అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో మద్యం దుకాణాలకు అనుమతిస్తే తాగుబోతులు భౌతికదూరం పాటిస్తారా? అని నిలదీశారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వైన్స్‌ ఓపెన్‌ చేయడంతో ఇన్ని రోజుల శ్రమ, వైద్యులు, పోలీసులు పడ్డ కష్టం వృథా అయిందని ఆయన మండిపడ్డారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఇసుక సరఫరా వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందనే ఆందోళన ఉందని, ఇసుక సరఫరా చేసే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాబోయే రెండు వారాలు కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మరిన్ని వార్తలు