పార్టీ మారాల్సిన అవసరం లేదు

10 Nov, 2018 10:35 IST|Sakshi
వైద్యశాలను ప్రారంభిస్తున్న మంత్రి అఖిలప్రియ

టూరిజం శాఖామంత్రి భూమా అఖిలప్రియ

ప్రకాశం, గిద్దలూరు: తాను పార్టీ మారాల్సిన అవసరం లేదని రాష్ట్ర టూరిజం శాఖామంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. గిద్దలూరులో నూతనంగా నిర్మించిన డీజీఆర్‌ వైద్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి శుక్రవారం హాజరైన ఆమె విలేకర్లతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న రూమర్స్‌ను ఖండిస్తున్నానని, టీడీపీలో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి తనవంతు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలోని అహోబిలంలో రోప్‌వే నిర్మాణం, ఏకో టూరిజం నిర్మాణం చేపట్టామన్నారు.

కర్నూలులోని శిల్పారామంకు ఈ నెలలోనే శంఖుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు అరకులో బెలూన్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నామని, ఈ పోటీల్లో 50 దేశాలకు చెందిన క్రీడాకారులు హాజరవుతున్నారన్నారు. కార్యక్రమంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధిరెడ్డి, వైద్యశాల వైద్యుడు డాక్టర్‌ హరినాథరెడ్డి, డాక్టర్‌ భూమా నరసింహారెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు పాల్గొని పూజలు చేశారు. ఉదయం వైద్యశాలకు వచ్చి ఒక గదికి రిబ్బన్‌ కటింగ్‌ చేసిన అధికారపార్టీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మంత్రి అఖిలప్రియ వచ్చే సమయానికి అక్కడ లేకుండా వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు