చంద్రబాబుకు భయం మొదలైంది : భూమన

7 Oct, 2018 10:13 IST|Sakshi

సాక్షి, విజయనగరం : ప్రజాసమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటితో 280 రోజులు పూర్తిచేసుకోవడం అభినందనీయమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ కష్టాలు కేవలం వైఎస్‌ జగన్‌తో మాత్రమే తీరుతాయనే విశ్వాసమే పాదయాత్ర పొడవునా వేలాదిమంది ఆయనతో పాటు నడిచేలా చేస్తోందన్నారు. ఆదాయపు పన్ను చెల్లించని వారిపై ఐటీ అధికారులు దాడులు చేయడం సర్వసాధారణమేనని తెలిపారు.

కానీ కొంత మందిపై జరిగిన దాడులను మొత్తం రాష్ట్రంపై జరిగిన దాడిగా సీఎం చంద్రబాబు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌ రెడ్డిపై జరుగుతున్న విచారణ, ఐటీ అధికారుల సోదాలపై మనకేం సంబంధమన్న చంద్రబాబు వ్యాఖ్యలతో ప్రజలు విస్తుపోతున్నారని తెలిపారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్టని, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను అధికార పార్టీకి అనుకూలంగా తయారు చేసారని విమర్శించారు. ఇప్పుడు ఐటీ అధికారులు అతని అనుచరులపై దాడి చేయడంతో చంద్రబాబుకు భయం మొదలైందన్నారు.  

మరిన్ని వార్తలు