-

టీడీపీని తరిమి కొట్టండి

18 Jul, 2018 04:22 IST|Sakshi
కార్యక్రమంలో మాట్లాడుతున్న భూమన కరుణాకరరెడ్డి

     ప్రజాకంటక పాలన కావాలో.. రామ రాజ్యం కావాలో తేల్చుకోండి

     ప్రజలకు వైఎస్సార్‌సీపీ నేత భూమన సూచన

విజయనగరం మున్సిపాలిటీ: దగాకోరు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజలందర్నీ నట్టేట ముంచారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాకంటక పాలన కావాలో.. రామరాజ్యం కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్న టీడీపీని వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మంగళవారమిక్కడ వైఎస్సార్‌సీపీ పట్టణ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతిని«ధుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భూమన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రాక్షస పాలనను కూకటివేళ్లతో పెకిలించే నాయకుడు ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని చెప్పారు.  నాలుగేళ్లుగా ప్రతిపక్ష నాయకునిగా వీరోచితమైన పాత్ర పోషిస్తున్న వైఎస్‌ జగన్‌ను అధికారంలోకి తీసుకువచ్చి రాజన్న రాజ్యం స్థాపించాల్సిన అవసరం ఉందన్నారు. మళ్లీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన తెచ్చుకోవడానికి జగన్‌కు అవకాశమివ్వాలని కోరారు. 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేస్తూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వైఎస్సార్‌ ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్న జగన్‌ను అన్ని వర్గాలవారూ ఆశీర్వదించాలని విజ్ఞప్తిచేశారు. అంతకుముందు భూమనకు యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్‌ కౌషిక్‌ స్థానిక వి.టి.అగ్రహారం వై జంక్షన్‌ వద్ద ఘన స్వాగతం పలికారు.

అక్కడ్నుంచి వందలాది బైక్‌లతో వైఎస్సార్‌ జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడున్న వైఎస్సార్‌ విగ్రహానికి భూమనతో పాటు పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అ«ధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ తదతరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు,  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు