సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 82 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. మరో ఏడు స్ధానాల్లో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర తర్జనభర్జనలు సాగిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. మలి విడత జాబితాలో రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోని అభ్యర్థుల పేర్లు అధికంగా ఉన్నాయి. సీనియర్ నేతల వారసులకూ జాబితాలో చోటుదక్కింది.
తాజా జాబితాతో మొత్తం 224 అసెంబ్లీ స్ధానాలకు గాను బీజేపీ ఇప్పటివరకూ 154 స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈనెల 9న 72 మంది పేర్లతో బీజేపీ తన తొలి జాబితాను విడుదల చేసింది. పాలక కాంగ్రెస్, బీజేపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపడుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 12న ఒకే విడత జరగనున్నాయి. మే 15న ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.