కేంద్ర పథకాలకు టీడీపీ స్టిక్కర్లు: కన్నా

10 Apr, 2019 16:57 IST|Sakshi

అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు  స్టిక్కర్లు వేసుకుని ఏపీలో లబ్ధిపొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. బుధవారం ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, పార్టీ అధికార ప్రతినిధి విజయ్‌ బాబు, తదితరులు కలిసి ఫిర్యాదు చేశారు. సత్తెనల్లి నియోజకవర్గంలో పోలీసులే టీడీపీ తరపున డబ్బులు పంపిణీ చేస్తున్నారని ద్వివేదీకి వివరించారు. ఎన్నికల్లో టీడీపీ దురాగతాలకు అడ్డుకట్టవేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు చింతామణి డ్రామాని రక్తికట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుది బ్లాక్‌మెయిలింగ్‌ స్వభావమని, ముందుకాళ్లకి బంధం వేయటంలో ఆయన దిట్టని విమర్శించారు. తన పనిని సక్రమంగా నిర్వర్తిస్తోన్న ఈసీని బెదిరించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో డబ్బులు, మద్యం ఏరులైపారుతోందని చెప్పారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ పెద్ద డ్రామా క్రియేట్‌ చేసి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులే టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, పోలీసు వాహనాలు, అంబులెన్స్‌ల్లో డబ్బులు తరలిస్తున్నారని చెప్పారు.

బాబు ఓటమిని అంగీకరించారు: జీవీఎల్‌

చంద్రబాబు నాయుడు  ఓటమిని ముందుగానే అంగీకరించారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వ్యాక్యానించారు. అధికార పార్టీ ద్వారా వేల కోట్ల నల్లధనం చేతులు మారుతోందని ఆరోపించారు. చంద్రబాబు దిగజారుడు మాటలు రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు. హైకోర్టు చివాట్లు పెట్టినా బాబుకు బుద్ధి రాలేదని అన్నారు. రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరిగితే పారదర్శకంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని జోస్యం చెప్పారు. పోలింగ్‌ రోజున కూడా టీడీపీ కుట్రలు పన్నే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మరిన్ని వార్తలు