ఏపీలో క్షీణించిన శాంతి భద్రతలు: కన్నా

6 Mar, 2019 18:05 IST|Sakshi
బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ(పాత చిత్రం)

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. బుధవారం గవర్నర్‌ నరసింహన్‌తో కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన అనంతరం మాట్లాడుతూ..ఏపీలో వ్యవస్థలన్నీ దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ గ్రిడ్‌ అనే ఓ ప్రైవేటు కంపెనీ మీద ఫిర్యాదు చేస్తే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఈ విషయంలో ఏపీ పోలీసులు హైదరాబాద్‌ దాకా ఎందుకు వచ్చారో అస్సలు అర్ధం కావడం లేదని విమర్శించారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి మా దగ్గరే ఉన్నాడని టీడీపీ చెప్పడం సిగ్గుచేటన్నారు.

ఈ డేటా చోరీ కేసును నిస్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. చట్టం తన పని తాను చేసుకోనీయకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు. తనతో పాటు ఏపీ బీజేపీ నేతలంతా గవర్నర్‌ను కలిసి ఏపీ ప్రభుత్వాన్ని భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేసినట్లు వివరించారు. ఎన్నికల కమిషన్‌ను కలుస్తామని తెలిపారు. ఈ డేటా చోరీ కేసు ఏపీ, తెలంగాణ సమస్య కాదని, 5 కోట్ల ఆంధ్రుల సమస్య అని వ్యాఖ్యానించారు. విషయాన్ని పక్కదారి పట్టించడానికి కుట్రలు సాగుతున్నాయని, టీడీపీ నాయకులు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

మరిన్ని వార్తలు