టార్గెట్‌ వాద్రా.. దాడిని ముమ్మరం చేసిన బీజేపీ

6 Feb, 2019 14:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకగాంధీ రాజకీయ ఆరంగేట్రం చేసిన నేపథ్యంలో ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా లక్ష్యంగా బీజేపీ తన దాడిని ముమ్మరం చేసింది. గతంలో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలపై ఈడీ విచారణకు హాజరయ్యేందుకు ఆయన సిద్ధమవుతున్న నేపథ్యంలో బీజేపీ తన విమర్శల దాడిని పెంచింది. పెట్రోల్‌, డిఫెన్స్‌ ఒప్పందాల ద్వారా రాబార్ట్‌ వాద్రా భారీ ఎత్తున ముడుపులు అందుకున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముడుపుల ద్వారా అందుకున్న డబ్బుతో లండన్‌లో వాద్రా ఎనిమిది ఆస్తులు కొన్నారని పేర్కొన్నారు.

ఈ కేసులో ముద్దాయిగా ఈడీ ముందు రాబర్ట్ వాద్రా హాజరవుతున్నారని చెప్పారు. వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాద్రా దోచుకున్నారని, అవినీతి పునాదులపై కాంగ్రెస్ పార్టీ నిలబడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని లూటీ చేసిందని, లక్ష రూపాయలు కూడా లేని వాద్రా దేశవిదేశాల్లో ప్లాట్లు ఎలా కొన్నారని, రోడ్‌పతి నుంచి కరోడ్‌పతి వరకు వాద్రా ఎలా ఎదిగారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ ఫ్యామిలీ అంతా బెయిల్ ఫ్యామిలీగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రియాంక గాంధీ ఫ్యామిలీ బిజినెస్‌లో చేరడం పెద్ద విషయం కాదంటూ ఆమె రాజకీయాల్లో చేరడాన్ని ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు