బీజేపీ ప్రచారంలో తెలుగు పాట

21 Apr, 2019 12:12 IST|Sakshi

భువనేశ్వర్‌ : ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు వినూత్న ప్రయత్నాలు చేస్తారు.ఆయా ప్రాంతాల వారిగా ఇష్టాయిష్టాలు తెలుసుకొని మరీ ప్రచారంలో అలాంటి పనులు చేస్తారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వచ్చిన ఏ చిన్న ఛాన్స్‌ను కూడా వదులుకోరు. తాజాగా మన పొరుగున ఉన్న ఒడిశాలో తెలుగు పాట పాడి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఓ బీజేపీ అభ్యర్థి.

సంబిత్ పాత్రా బీజేపీ జాతీయ ప్రతినిధిగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశాలోని పూరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా.. శుక్రవారం రాత్రి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. సభకు వచ్చిన కొందరు తెలుగువాళ్లు సరదాగా పాట పాడమని సంబిత్‌ను కోరారు. ఇంకేముంది మన పొలిటికల్‌ లీడర్‌ కాస్త సింగర్‌ అవతారం ఎత్తాడు. నాగార్జున నటించిన క్రిమినల్‌ సినిమాలోని తెలుసా.. మనసా అనే పాటను ఆలపించారు. సంబిత్ పాడిన పాటకు అక్కడున్న జనాలంతా చప్పట్లుకొట్టారు. అద్భుతంగా పాడారంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రొఫెషనల్‌ సింగర్‌ మాదిరిగా పాటను ఆపపించారంటూ పొగడ్తలతో ముంచేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారగా.. నెటిజన్లు సైతం సంబిత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు