మా పథకాలనే కేంద్రం కాపీ కొట్టింది: బెంగాల్ సీఎం
కోల్కత్తా: లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ 2019పై బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందిచారు. తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలనే కేంద్రం కాపీకొట్టిందని, వాటి పేర్లునే మార్చి కొత్తగా ప్రకటించారని ఆమె మండిపడ్డారు. కేంద్రం ఇస్తామన్న రైతు సాయం తమకు వద్దని, అరకొర సాయం తమకు అవసరంలేదని మమత తేల్చిచెప్పారు. ఐదెకరాలు గల రైతులకు ప్రతిఏటా ఆరువేల రైతు సాయంను అందిస్తామని కేంద్రం బడ్జెట్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
సమాఖ్య వ్యవస్థను బీజేపీ నేతలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మమత విమర్శించారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్నందునే కేంద్రం ఈ ప్రజాకర్ష బడ్జెట్ను ప్రవేశపెట్టిందని అన్నారు. దీన్ని ఎన్డీయే ఎన్నికల వ్యూహంగా ఆమె వర్ణించారు. మోదీ ప్రభుత్వానికి కాలం తీరిందని, ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ చెల్లదని వ్యాఖ్యానించారు.