కావాలనే మాపై దుష్ప్రచారం!

11 Mar, 2018 11:34 IST|Sakshi

బీజేపీ కోర్‌కమిటీ సమావేశం

టీడీపీ తీరుపై మండిపాటు

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ కోర్‌కమిటీ ఆదివారం సమావేశమైంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీరాజు, ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాసరావు, మాధవ్, గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్న ఈ భేటీలో టీడీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంపై ప్రధానంగా నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదాపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ముమ్మరమైన నేపథ్యంలో టీడీపీ కేంద్ర మంత్రులు ఇటీవల ఎన్డీయే ప్రభుత్వం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అనంతరం బీజేపీ, కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌గా టీడీపీ నేతలు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ ప్రచారాన్ని తిప్పికొట్టడం.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానిపై సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.

కావాలనే కేంద్రంపై దుష్ప్రచారం..
ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. కావాలనే కేంద్రంపై కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి తప్పిస్తున్నారని పరోక్షంగా టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. వాస్తవాలన్నింటినీ ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు