థర్డ్‌ఫ్రంట్‌ బీరాలేమయ్యాయి?

1 May, 2018 01:00 IST|Sakshi

ధ్వజమెత్తిన బీజేపీ

సాక్షి, హైదరాబాద్‌: ‘చెన్నైలో డీఎంకే అధినేత కరుణానిధితో చర్చలు బెడిసికొట్టాయో..ఏమోగాని నిన్నటి వరకు థర్డ్‌ ఫ్రంట్‌ అంటూ బీరాలు పలికిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడది మీడియా సృష్టి అంటూ మాట మార్చారు’ అని బీజేపీ విమర్శించింది. సోమవారం ఇక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధికార ప్రతినిధులు సుభాష్, ప్రకాశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

అధికార వ్యామోహంతో బెంగాల్, చెన్నై అంటూ పర్యటిస్తున్న కేసీఆర్‌కు ప్రగతిభవ న్‌ దాటి సచివాలయానికి వచ్చే సమయం ఉండదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్నతవిద్య భ్రష్టు పట్టిపోయిందని, కళాశాలలు, వర్సిటీల్లో అధ్యాపకులను కూడా నియమించటం లేదన్నారు. సీఎంగా రాష్ట్రాన్ని ఉద్ధరించలేని కేసీఆర్‌ ఢిల్లీలో ఏం చేస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలో భూకంపం తెస్తానంటున్న ఆయన అక్కడ ఇసుక రేణువును కూడా కదల్చలేరని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు