ఇక దేశం మొత్తం మాదే.. : అమిత్‌ షా

3 Mar, 2018 16:59 IST|Sakshi

అన్ని చోట్ల బీజేపీ జెండా ఎగురుతుందన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు

మోదీ విధానాల వల్లే విజయం అంటూ వ్యాఖ్య

మిగితా రాష్ట్రాలు గెలిస్తే బీజేపీకి స్వర్ణయుగమంటూ వెల్లడి

త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ విజయం ఖరారు!

సాక్షి, న్యూఢిల్లీ : లెఫ్ట్‌ పార్టీ ఈ దేశానికి రైట్ ‌(సరైనది) కాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. బీజేపీకి ఇది చాలా సంతోషకరమైన రోజు అని, 21 రాష్ట్రాల్లో తాము అధికారంలోకి వచ్చామని చెప్పారు. ఒడిశా, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వస్తే ఇక బీజేపీకి స్వర్ణయుగమే అని ఆయన అన్నారు. శనివారం త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. త్రిపుర, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దాదాపు ఖరారైన నేపథ్యంలో నేపథ్యంలో అమిత్‌షా మీడియాతో మాట్లాడారు.
 
'ఇది బీజేపీకి చారిత్రాత్మక రోజు. ప్రధాని మోదీ విధానాలకు అందిన విజయం ఇది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ జెండా ఎగురుతుంది. మూడు రాష్ట్రాల కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు. 2013లో త్రిపురలో మాకు 1.3శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఇప్పుడు 43 స్థానాలు గెలుస్తున్నాం. త్రిపురలో పలువురు కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారు. త్రిపుర వాసులు వామపక్షాల నుంచి విముక్తి కోరుకుంటున్నారు. త్రిపుర, నాగాలాండ్‌లో కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరవలేక పోయింది. మాపై నమ్మకంతో ఓట్లు వేసిన త్రిపుర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీకి ఓటింగ్‌ శాతం పెరిగింది. ఇక కర్ణాటకలో భారీ మెజార్టీ లక్ష్యంగా బరిలోకి దిగుతాం. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి మాలక్ష్యం. దేశంలో 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

నాగాలాండ్‌లో కూడా అధికారంలోకి వస్తాం. దేశంలోని ఏ ప్రాంతానికి కూడా లెఫ్ట్‌ (వామపక్ష పార్టీలు) రైట్‌ (సరైనది) కాదు. త్రిపుర ఓటర్లు మార్పునకు పట్టంకట్టారు. మేఘాలయలో మెజార్టీ రాకున్నా అక్కడి ప్రజలు కూడా మార్పును కోరుకున్నారు. వచ్చే ఎన్నికలకు ఈ ఫలితాలు దిక్సూచిలాంటివి. నాలాంటి బీజేపీ కార్యకర్తలకు చాలా సంతోషకరమైన రోజు. దేశంలోని 21 రాష్ట్రాల్లో మేం అధికారంలో ఉన్నాం. ప్రతి రోజు ప్రధాని నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వానికి అనుకూలత పెరుగుతోంది. దేశంలో పశ్చిమ దిక్కున చాలా అభివృద్ధి చెందింది కానీ, అలాంటిది తూర్పు దిక్కు లేదని 2014లో ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఆ వెంటనే ఆయన 'యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ'ని ప్రారంభించారు. ఆయన విధానాలే ఈ భారీ విజయాన్ని అందించాయని మేం నమ్ముతున్నాము. ఇక ఒడిశా, బెంగాల్‌, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా మేం అధికారంలోకి వస్తే బీజేపీకి ఇక స్వర్ణయుగమే' అని అమిత్‌ షా అన్నారు.

మరిన్ని వార్తలు