న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడేందుకు యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇందులోభాగంగా రాష్ట్రంలోని 230 నియోజకవర్గాల్లో 60 లక్షల నకిలీ ఓటర్లను ప్రభుత్వం నమోదుచేసిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసింది. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్నాథ్ నేతృత్వంలో ఈసీని ఆదివారం కలసిన కాంగ్రెస్ బృందం.. నకిలీ ఓటర్లకు సంబంధించిన సాక్ష్యాలను సమర్పించింది. ఈ 60 లక్షల పేర్లను వెంటనే ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ నకిలీలను తొలగించేందుకు ప్రత్యేకమైన పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని ఈసీకి మరోసారి విజ్ఞప్తి చేసింది.