టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు 

12 Oct, 2018 02:36 IST|Sakshi

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పుపై లక్ష్మణ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పడం అంటే  మొట్టికాయలు వేయడమేనని వ్యాఖ్యానించారు. ఇక అమిత్‌ షా బహిరంగ సభ విజయవంతం అయిందని తెలిపారు. అమిత్‌ షా సభతో టీఆర్‌ఎస్‌ నాయకులకు ముచ్చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. త్వరలో మోదీ కూడా వస్తారని, అప్పుడు టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏంటో చూసుకోవాలన్నారు.  

ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పడం లేదన్నారు. ప్రధాని ఏకకాలంలో ఎన్నికలకు పోదామని చెబితే సరేనని, మళ్లీ ముందస్తుకు వెళ్లారన్నారు. టీఆర్‌ఎస్‌ డ్రామా కంపెనీలా తయారైందని లక్ష్మణ్‌ విమర్శించారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు పొంది ఒక్క లెక్క కూడా చెప్పడం లేదని ఆరోపించారు. అనంతరం బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. అందులో లక్ష్మణ్‌తోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ సంఘటన సంయుక్త ప్రధాన కార్యదర్శి సంతోష్, రాష్ట్ర ఇన్‌చార్జి కృష్ణదాస్, జాతీయ నాయకుడు ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమెరి కా కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ క్యాథరిన్‌ బి.హడ్డాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మ ణ్‌ కలిశారు. ఆమెను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు