కాంగ్రెస్‌కు వత్తాసు పలకడానికే..

23 Apr, 2018 15:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీకి వత్తాసు పలకడానికే సీపీఎం మహాసభలు పెట్టారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వంలో కలిసి పనిచేసిన సీపీఎంకు కాంగ్రెస్‌ అవినీతికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. యూపీఏ హయంలో 11లక్షల కోట్ల కుంభకోణాల చోటుచేసుకున్నాయని విమర్శించారు. పేదల పక్షాన ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని ఓడించడమని సీపీఎం పిలుపునివ్వడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

పశ్చిమ బెంగాల్‌, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌తో సీపీఎం లోపాయికారి ఒప్పందం పెట్టుకోవాలని సభలో రాజకీయ తీర్మానం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. సీపీఎం మహాసభలో కార్మికుల, పేదల గురించి అసలు చర్చే లేదని విమర్శించారు. మతోన్మాద మజ్లిస్‌, ముస్లింలీగ్‌తో పొత్తుపెట్టుకున్న సీపీఎం లౌకికవాదం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

 

>
మరిన్ని వార్తలు