బీజేపీ మాజీ సీఎంకు టికెట్‌ ఆఫర్‌ చేసిన కాంగ్రెస్‌

24 Jan, 2019 16:23 IST|Sakshi

భోపాల్‌ : రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బీజేపీని గద్దె దించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం మరింత ఉత్సాహంగా సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో బీజేపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నాయకుడు బాబులాల్‌ గౌర్‌ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌.. తనను భోపాల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయమని కోరినట్లు బాబులాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ నన్ను కలిశారు. రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున భోపాల్‌ నుంచి పోటి చేయమని కోరిన’ట్లు బాబులాల్‌ తెలిపారు. అయితే ఈ విషయం గురించి ఇప్పుడే ఏమి చెప్పలేనని.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని దిగ్విజయ్‌తో చెప్పినట్లు తెలిపారు బాబులాల్‌.

మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో భంగపడిన బీజేపీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త వ్యూహాలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భాగంగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో సీనియర్లను పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్‌ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిస్తోంది.

మరిన్ని వార్తలు