టీఎంసీలోకి బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు

21 Jul, 2018 15:12 IST|Sakshi

కోల్‌కత్తా : రానున్న ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)ను ఎదుర్కొవాలనుకుంటున్న బీజేపీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత చందన్‌ మిత్రా శనివారం టీఎంసీలో చేరారు. బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీకి ప్రధాన సహచరుడైన మిత్రా రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. గత కొంత కాలంగా నరేంద్ర మోదీ, అమిత్‌ షా నాయకత్వంతో విభేదిస్తున్న మిత్రా ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన మొదటిసారి 2003లో రాజ్యసభలో అడుగుపెట్టగా, 2010లో రెండోసారి మధ్యప్రదేశ్‌ నుంచి పెద్దల సభకు ఎన్నికైయ్యారు. 2014లో హుగ్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.

మిత్రాతో పాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేరారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమర్‌ ముఖర్జీ, అబూ తెహర్‌, షబీనా యాస్‌మిన్‌, అఖ్రుజ్‌మాన్‌లు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఎంసీలు చేరారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీనియర్‌ నేతలు పార్టీని వీడటం బీజేపీ, కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బగానే భావించాలి.

మరిన్ని వార్తలు