చంద్రబాబును ఓడించే సత్తా బీజేపీకే..

15 Mar, 2019 18:12 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన తప్పులు బయటకు వస్తాయనే బీజేపీపై ఎదురు దాడి చేస్తున్నారని బీజేపీ నేత చిన్నం రామకోటయ్య వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణానికి అన్ని వేల ఎకరాలు ఎందుకో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన నిధులు చంద్రబాబు దుబారా చేసింది ‌వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇచ్చిన నిధులకు లెక్క చెప్పకుండా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని‌ విధంగా నిర్మాణాల పేరుతో కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. 

ఏపీలో అసమర్ధ పాలనను పారద్రోలాలని ఏప్రిల్11న  ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. చంద్రబాబును ఓడించే సత్తా బీజేపీకే ఉందన్నారు. 2009లో నూజివీడు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందానని, గత ఎన్నికలలో బీజేపీ తరపు నుంచి పోటీ చేయాలని భావించినా పొత్తుల వల్ల సాధ్యం కాలేదని తెలిపారు. నేడు ప్రధాని నరేంద్రమోదీ పాలనను దేశ ప్రజలంతా మెచ్చుకుంటున్నారని వెల్లడించారు. గత ఎన్నికలలో బీజేపీకి మిత్రునిగా ఉన్న బాబు.. ఇప్పుడు శత్రువుగా మారారన్నారు.

బీజేపీ అండ కారణంగానే అధికారంలోకి
బీజేపీ అండ కారణంగానే  2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని బీజేపీ నేత బాష వ్యాఖ్యానించారు. నాలుగున్నరేళ్లల్లో అవినీతితో కోట్ల రూపాయలు దోచుకున్నారుని ఆరోపించారు. 600 హామీలను ఇచ్చి, అమలు చేయలేక నెట్లో కూడా మేనిఫెస్టో తొలగించిన పిరికివాడంటూ మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన‌ చంద్రబాబుకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు బీజేపీపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు